ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికార సంస్థలను సంప్రదించాలని చెప్పారు.హైదరాబాద్లోని కాచిగూడ బస్ టెర్మినల్లో ‘అమ్మఒడి’ తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని, కాచిగూడ రైల్వే స్టేషన్లో పిల్లల దత్తత కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో పాటు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దత్తత తీసుకోవాలనుకునే వారు ఐసీడీఎస్ ద్వారా మాత్రమే ముందుకు రావాలని సూచించారు. అనధికార మార్గాల్లో దత్తతలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.పిల్లల తల్లులకు సౌకర్యం కల్పించేందుకు బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.అలాగే సమ్మక్క-సారలమ్మ జాతర వంటి భారీ కార్యక్రమాల్లో కూడా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
