Breaking News

పశుసంవర్ధకంలో అవకాశాలు అపారం.. యువత ముందుకు రావాలి: అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగం భవిష్యత్‌కు బలమైన ఆధారంగా మారుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. యువత ఐటీ వంటి సాంకేతిక రంగాల వైపు ఎక్కువగా మళ్లుతున్న నేపథ్యంలో, పశుసంవర్ధకాన్ని కూడా వృత్తిగా ఎంచుకోవాలని ఆయన సూచించారు.అమరావతిలో పశుసంవర్ధక మార్గదర్శిని ఈ-మ్యాగజైన్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ద్వారా రూ.1.76 లక్షల కోట్ల స్థూల వృద్ధి నమోదైందని చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని, అందుకే యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, పందుల పెంపకం వంటి రంగాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయవచ్చని సూచించారు.విశాఖలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 1500 మందికి శిక్షణ ఇచ్చామని, అందులో 200 మంది విజయవంతంగా వ్యాపారాలు ప్రారంభించారని వెల్లడించారు. ఈ రంగంలో సరైన మార్గదర్శకత్వం ఉంటే మంచి ఆదాయం సాధ్యమని తెలిపారు.రైతులకు అవసరమైన సమాచారం అందించేందుకు ఈ-మ్యాగజైన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. పశువుల ఆరోగ్యం, పోషణ, మార్కెటింగ్ వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో పశుసంవర్ధకాన్ని చేపడితే ఏడాదికి ఒక ఎకరానికి రూ.5-6 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు.ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *