ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ నిధుల్లో మెటీరియల్ భాగానికి రూ.1123.15 కోట్లు, పరిపాలనా వ్యయాలకు రూ.69.01 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి.ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ, ఈ నిధులు లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ఇవి తోడ్పడతాయని అన్నారు. కూలీలకు వేతనాలు నేరుగా అందేలా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద కూడా ఇటీవల రూ.207 కోట్ల నిధులు విడుదలైన సంగతి గుర్తుచేశారు. ఈ చర్యలు గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
