ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల విచారణలో భాగంగా రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్కు మూడు విడతలుగా డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడైంది. ఈ మొత్తాలు జమ అయిన మరుసటి రోజే నగదుగా ఉపసంహరించుకున్నట్లు సమాచారం.ఈ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో పాటు, మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల ఖాతా వివరాలను సమర్పించాలని బ్యాంకులకు లేఖలు పంపించారు.డబ్బుల బదిలీలు, ఉపసంహరణల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి పోలీసులు దర్యాప్తును మరింత విస్తరించారు. ఈ కేసులో ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
