మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించడంతో, మే డే సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టపరమైన రక్షణ కలగనుంది.ఈ బిల్లుతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. పని భద్రత, ఆరోగ్య బీమా వంటి పథకాలను అందించడమే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు. అగ్రిగేటర్ కంపెనీల నియంత్రణకు నిబంధనలు తీసుకొచ్చి, కార్మికుల హక్కులను బలపరిచారు.అదేవిధంగా సర్వీస్ టాక్స్లో కొంత భాగాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించేలా చర్యలు చేపట్టారు. పనివేళలు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయడానికి కార్మిక శాఖ చర్యలు ప్రారంభించింది. అసంఘటిత రంగంలో ఉన్న గిగ్ ఎకానమీకి ఈ చట్టం కీలక మలుపుగా నిలవనుందని భావిస్తున్నారు.
