మే 01, (నేటి తెలుగు పత్రిక): పౌరసత్వ ప్రక్రియలను మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ‘పౌరసత్వ (సవరణ) నిబంధనలు, 2026’ను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సవరణలు ముఖ్యంగా డిజిటలైజేషన్, పారదర్శకతపై దృష్టి సారించాయి.కొత్త నిబంధనల ప్రకారం, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నమోదు, రద్దు ప్రక్రియలు పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల పునరావృత పత్రాల సమర్పణ అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన e-OCI విధానం ద్వారా దరఖాస్తుదారులు డిజిటల్ కార్డును పొందే అవకాశం ఉంది. అవసరమైతే భౌతిక కార్డును కూడా తీసుకోవచ్చు.అయితే, మైనర్ పిల్లల పౌరసత్వ విషయంలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఒకే సమయంలో రెండు దేశాల పాస్పోర్ట్లు కలిగి ఉండరాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వంద్వ పాస్పోర్ట్ సమస్యలను నివారించడంలో కీలకంగా భావిస్తున్నారు.అదేవిధంగా OCI హోదా రద్దు చేసిన సందర్భంలో, కార్డును తప్పనిసరిగా అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఇవ్వకపోయినా, ప్రభుత్వం డిజిటల్ రికార్డుల ద్వారా రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. దరఖాస్తు తిరస్కరణపై అప్పీల్ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు.ఈ మార్పులతో ప్రవాస భారతీయులకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
