మే 01, (నేటి తెలుగు పత్రిక): మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులేనని పేర్కొన్నారు.సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన ఆయన, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి శ్రామికులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వారి పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పనిచేసే కార్మికులకు గౌరవం పెంచే దిశగా ‘కూలీలు’ అనే పదాన్ని ‘శ్రామికులు’గా మార్పు చేసినట్లు చెప్పారు. అలాగే వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పరిహారాన్ని పెంచినట్లు వెల్లడించారు.కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికునికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.
