మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “జగన్ బెల్స్లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది” అంటూ ఎద్దేవా చేశారు.కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేశామని నిరూపించగలరా అంటూ జగన్ అండ్ కోకు సవాల్ విసిరారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెన్షన్ల పంపిణీ జరుగుతోందని, ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతున్న కార్యక్రమమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి నెల పింఛన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అసత్యమని మండిపడ్డారు. ప్రజలకు ఎవరు ఎక్కువగా మేలు చేశారో ఆధారాలతో చర్చకు సిద్ధమని చెప్పారు. జగన్ పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. గ్రామీణ, దూర ప్రాంతాలకు కూడా మెరుగైన రహదారులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
