మే 01, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేడే రోజు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోవాలని హితవుపలికారు.మీడియాతో మాట్లాడిన ఆయన, కార్మిక దినోత్సవం రోజున కార్మికుల సంక్షేమంపై మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం పనితీరుపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం చట్టం తీసుకొచ్చిన విషయం కూడా కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో కార్మిక సంక్షేమంపై ఆయన వైఖరి అందరికీ తెలిసిందేనన్నారు.కేవలం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మీడియాలో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా నాయకుడిగా సీఎం ఎదుగుతున్న తీరు నచ్చకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
