హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్య ప్రజలపై భారంగా మారిందని ఆయన విమర్శించారు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను సుమారు రూ.1000 వరకు పెంచడం అన్యాయమని మండిపడ్డారు. ఒక్కసారిగా 30-35 శాతం ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం అనుమానాస్పదమని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపు సామాన్యుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కూడా ఈ పెంపును వ్యతిరేకిస్తున్నాయి.
