కరీంనగర్, మే 01, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.రైతుల ఆశలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వడ్లు కొనుగోలు విషయంలో తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు.వడ్లకు బోనస్ హామీ అమలు కాలేదని, గత సీజన్లో కూడా రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర అమలు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగినా తగిన పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు చెల్లించాల్సిన వేల కోట్ల పరిహారంలో చాలా తక్కువ మొత్తమే ఇచ్చారని అన్నారు.రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ విధానం మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
