కృష్ణా జిల్లా, మే 01, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వంలో కార్మికులకు భద్రతతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. పమిడిముక్కలలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలనలో పరిశ్రమలు దూరమవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, భవన నిర్మాణ రంగంలో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఏపీలో పనుల కోసం వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఐదు నగరాల్లో ఏర్పాటు చేసిన సమగ్ర కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.మరోవైపు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, కార్మికులు, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.
