మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గత పది రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం ఈ భేటీకి వెళ్లనున్నారు.గత నెలలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పవన్ అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఇదే సమయంలో, నందగిరి హిల్స్లో ఇటీవల మరణించిన రీజెన్సీ సెరామిక్స్ అధినేత జి.ఎన్. నాయుడు కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ రోజు ఆయన కార్యక్రమాల్లో ఈ రెండు సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
