హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్లకు సంబంధించిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిబంధనల మేరకే చెల్లించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.హ్యామ్ రోడ్లపై ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు. 2026 నుంచి హ్యామ్ విధానంలో దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు సంస్థలు ఇచ్చే బ్యాంకు గ్యారెంటీల ఆధారంగా 10 శాతం వరకు అడ్వాన్స్లు ఇవ్వవచ్చని, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తరువాత బిల్లుల నుంచి తిరిగి వసూలు చేస్తామని స్పష్టం చేశారు.హ్యామ్ రోడ్ల టెండర్లలో కాంట్రాక్టర్లు 15 నుంచి 23 శాతం వరకు అధికంగా కోటేషన్లు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. నిర్మాణ సమయంలో 18 శాతం జీఎస్టీ, ప్రతి 70 కిలోమీటర్లకు అంబులెన్స్ ఏర్పాటు వంటి నిబంధనలు కూడా వ్యయాన్ని పెంచుతున్నాయని చెప్పారు. అయితే ఈ ఖర్చులు అంచనాల్లో చేర్చకపోవడం వల్లే ఎక్సెస్ టెండర్లు వచ్చాయని వివరించారు.ఇప్పటికే సాంకేతిక బిడ్ల పరిశీలన పూర్తయిందని, ఆర్థిక బిడ్లు ఇంకా ఖరారు కాలేదని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
