హైదరాబాద్/హుస్నాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్డిపోలు, బస్స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన మెరుగుపర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ లోపు పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.కార్మికుల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రతి నెల రెండో మంగళవారం గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డిపోలు, బస్స్టేషన్లలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు సహా క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి లేకుండా, సహకార దృక్పథంతో పని చేయించాలని తెలిపారు. నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి పరిస్థితులను మెరుగుపర్చాలని సూచించారు.టికెట్ జారీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరికలతో ప్రదర్శించడం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
