న్యూఢిల్లీ, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఎయిర్ కండిషనర్ పేలడంతో నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించి సుమారు 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశముందని సూచిస్తున్నారు.
