హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ప్రభుత్వ విప్లు మరింత చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని అన్నారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శాసనమండలి, శాసనసభ విప్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వానికి విప్లు కళ్లు, చెవుల్లాంటివారని పేర్కొంటూ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని సూచించారు.వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని విప్లకు సీఎం తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వారంలో ఒక రోజు అందుబాటులో ఉంటానని కూడా ప్రకటించారు.ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణరావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం పాల్గొన్నారు.
