ఆంధ్రప్రదేశ్, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగడంతో కేసు మరింత వేగం అందుకుంది.ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కుంభకోణం విలువ సుమారు రూ.3,500 కోట్లుగా భావిస్తున్నారు. ఇందులో దాదాపు రూ.2,000 కోట్ల వరకు లెక్కల్లో చూపని నగదు సృష్టించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం బ్రాండ్లపై 15 నుంచి 20 శాతం వరకు కిక్బ్యాక్స్ వసూలు చేసి, నెలకు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు అక్రమ సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితులు నగదు తరలింపుకు రహస్య మార్గాలను ఉపయోగించినట్లు బయటపడింది. హైదరాబాద్లోని విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబాయ్కు అక్రమంగా నగదు మళ్లించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి.ఇక ముడి సరుకుల కొనుగోళ్లలో కూడా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బాటిళ్లు, క్యాప్ల ధరలను మార్కెట్ రేట్ల కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా చూపించి, ఆ అదనపు మొత్తాన్ని బ్లాక్ మనీగా మార్చినట్లు అధికారులు గుర్తించారు.డిజిటల్ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు VPNలు, అంతర్జాతీయ నంబర్లు, ఎన్క్రిప్టెడ్ యాప్లను వినియోగించినప్పటికీ, కొరియర్ నెట్వర్క్లు, మధ్యవర్తుల ద్వారా జరిగిన నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది.ఈ వ్యవహారంలో భాగమైన డిస్టిల్లరీలు, ప్రొఫెషనల్స్, మధ్యవర్తులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ, ఎగవేసిన పన్నులతో పాటు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ దర్యాప్తులో మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
