అమరావతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరిశుభ్రత కోసం చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలను ఆమె అభినందించారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో సింధు మాట్లాడుతూ, గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ వ్యవస్థ ద్వారా మురుగు నీరు రోడ్లపైకి రాకుండా నియంత్రించబడుతుందని, భూగర్భ జలాల స్థాయి మెరుగుపడే అవకాశముందని ఆమె వివరించారు. కాలువల్లోనే నీరు ఇంకిపోవడం వల్ల దుర్వాసన సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు.ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పవన్ కల్యాణ్కు హ్యాట్సాఫ్ చెబుతూ, రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సింధు ఆకాంక్షించారు.ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా స్పందిస్తూ, మ్యాజిక్ డ్రెయినేజ్ వ్యవస్థపై అభిప్రాయం వ్యక్తం చేసిన పీవీ సింధుకు ధన్యవాదాలు తెలిపింది.
