సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.జిల్లాలోని మల్లారం వద్ద సిద్దిపేట-కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించిన ఆయన, గత 28 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, అక్కడ ధాన్యం సేకరణ జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడదెబ్బ కారణంగా ధాన్యం కుప్పల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన హరీశ్ రావు, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
