తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై బీజేపీ నేత, పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాల నెయ్యి సరఫరా వ్యవహారంలో నలుగురు అధికారులే బాధ్యులని తెలిపారు.దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదికలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర కీలకమని కమిషన్ తేల్చిందని తెలిపారు. నిబంధనల సడలింపుల కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన భానుప్రకాశ్ రెడ్డి, మే 6న జరిగే పాలక మండలి సమావేశంలో ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా, లడ్డూ నాణ్యతపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ పాలక మండలి సభ్యుడు ఓవీ రమణ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా లడ్డూ నాణ్యత మెరుగుపడలేదని, అవసరమైన పదార్థాలు సరైన మోతాదులో లేవని అన్నారు.శ్రీవారి లడ్డూ భక్తుల విశ్వాసానికి సంబంధించినదని, ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నాణ్యతను కాపాడాలని ఆయన సూచించారు.
