న్యూఢిల్లీ,మే 03, (నేటి తెలుగు పత్రిక): అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 29 వరకు జరిగిన పోలింగ్ అనంతరం మొత్తం 823 స్థానాలకు ఓట్ల లెక్కింపు మే 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ కూడా గెలుపుపై విశ్వాసంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఆధిక్యం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మళ్లీ గెలుస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొత్త పార్టీల ప్రభావం కూడా కొంత మేర ఉండొచ్చని భావిస్తున్నారు.పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి.మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
