ఉలవపాడు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం మరియు ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ప్రకాశం జిల్లా ఉలవపాడులో నిర్వహించిన వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. నూతన రథానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆలయాలకు కనీస పరిరక్షణ కూడా అందించలేదని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.టీటీడీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 5,000 కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో 800 ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.అలాగే, రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులకు ప్రతినెలా రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
