హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. బంజారాహిల్స్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గోరక్షక సంఘాల ప్రతినిధులతో ఆయన కీలక సూచనలు చేశారు.పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. అక్రమ పశు రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులపై దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఉద్రిక్తతలకు దారితీసే వీడియోలు, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోరక్షకులు తనిఖీల పేరుతో ఆయుధాలు ధరించడం, వాహనాలను అడ్డుకోవడం, పోలీసుల పనిలో జోక్యం చేసుకోవడం వంటి చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.వాలంటీర్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ధరించాలని, ప్రతి సంఘం నుంచి ఒక ప్రతినిధి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. అక్రమ రవాణాపై సమాచారం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ను 24 గంటలూ సంప్రదించవచ్చని తెలిపారు. పౌరులందరూ సహకరించి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
