అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్ను ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు అక్కడ నిర్బంధించి, ఖర్చుల పేరుతో రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.గత ఏడాది నవంబర్లో ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లిన షహ్నాజ్కు అక్కడి పని నచ్చక తిరిగి రావాలని భావించగా, ఏజెంట్లు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని షహ్నాజ్ భర్త అబూబకర్ ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేశారు.దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ఒమన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. పోలీసుల జోక్యంతో ఏజెంట్లతో చర్చలు జరిపి, ఖర్చులు భరించి షహ్నాజ్ను స్వదేశానికి పంపేందుకు ఒప్పించారు.మే 7వ తేదీన షహ్నాజ్ భారత్కు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చొరవ చూపిన ఏపీఎన్ఆర్టీ సొసైటీని ఆయన అభినందించారు.
