మే 05, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సూచనల మేరకు పెద్ద యజ్ఞంలా కొనసాగిస్తున్నామని చెప్పారు. హనుమంత గుండం చెరువు నుంచి 23 కిలోమీటర్ల కాల్వ పరిధిలోని ఐదు చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. వాగులు, వంకల్లో జంగిల్ క్లియరెన్స్తో పాటు మట్టి తవ్వకం పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగితే రైతులు బోర్ల ద్వారా పంట సాగు చేసుకునే అవకాశం పెరుగుతుందని మంత్రి అన్నారు. చెరువులు, కాలువల నుంచి తీసిన మట్టిని అవసరమైన రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం కార్యక్రమం ద్వారా భూగర్భ జల మట్టం 3 మీటర్ల లోపు వచ్చేలా లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
