మే 05, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పూర్తిగా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రత్తిపాడు ప్రాంతానికి కీలకమైన ఈ ఛానల్లో నీటి ప్రవాహం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ను ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి పరిశీలించిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ఛానల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి ప్రవాహం అడ్డుకుపోయిందని పేర్కొన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును 47 కిలోమీటర్ల నుంచి 74 కిలోమీటర్ల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.రూ.369 కోట్లతో ఆధునికీకరణ పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చామని, రూ.70 కోట్లతో భూసేకరణ పూర్తయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా వైసీపీ హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ, ప్రాజెక్టు అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు తెలిపారు.
