మే 05, (నేటి తెలుగు పత్రిక): రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. “సురక్షిత రోడ్లు – సురక్షిత జీవితం” అనే నినాదంతో కార్యక్రమం కొనసాగింది.హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం ఎంత ఖరీదైనదైనా, హెల్మెట్ ధరించకపోతే అది ప్రాణానికి రక్షణ ఇవ్వదని అన్నారు.పాయకరావుపేటలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నాయకులు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. “హెల్మెట్ ధరిద్దాం – ప్రాణాలు కాపాడుకుందాం” అనే నినాదాన్ని మంత్రి అనిత ఇచ్చారు.
