మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీసిటీలో Carrier సంస్థ భారీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.సుమారు 39 ఎకరాల్లో ఈ ప్లాంట్ను అభివృద్ధి చేయనున్నారు. మూడు దశల్లో రూ.1000 కోట్ల పెట్టుబడితో 2028 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపు ఈ ప్రాజెక్ట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.ఈ యూనిట్ ప్రధానంగా హెచ్వీఏసీ (HVAC) ఉత్పత్తుల తయారిపై దృష్టి సారించనుంది. ఆధునిక సాంకేతికతతో నిర్మించబడే ఈ ప్లాంట్ దేశీయంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చనుంది.ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. లాజిస్టిక్స్, సప్లై చైన్, సేవల రంగాల్లో కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.ఇప్పటికే శ్రీసిటీ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా మారింది. ఇప్పుడు క్యారియర్ వంటి దిగ్గజ సంస్థ రావడంతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపిరి అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
