మే 05, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహానాడు తెలుగు దేశం పార్టీకి కుటుంబ పండుగలాంటిదని, దీన్ని రాజకీయంగా చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమంతో మహానాడు ప్రారంభమవుతుందని చెప్పారు.మహానాడుతో వైసీపీకి సంబంధమే లేదని, ఇది పూర్తిగా కార్యకర్తలతో మమేకమయ్యే వేదిక అని కోటంరెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో చేసిన హామీలు నెరవేర్చలేకపోయిన కాకాణి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.మంత్రి నారాయణపై కాకాణి చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. పెద్దగా మాట్లాడితే అబద్ధం నిజం కాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కాకాణి మాట్లాడే భాషపై కూడా స్పందిస్తూ, “మీరు ఉపయోగించే భాష ఎలా ఉంటే, మా స్పందన కూడా అలాగే ఉంటుంది” అంటూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హెచ్చరించారు.
