జనగామ/హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా?’’ అనే వ్యాఖ్యలతో హిందువులను కించపరిచారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్రావు తీవ్రంగా స్పందించారు. ‘‘జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ గాంధీ అంటే డబ్బులు వస్తాయా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.జనగామలో మాట్లాడిన రఘునందన్రావు, కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. శ్రీరామ నామంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. రాముడిని విమర్శించిన పలువురు నేతలు దేశంలో ప్రాధాన్యం కోల్పోయారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాకతీయ ప్రాంతంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, ఈనెల 10న సికింద్రాబాద్లో జరిగే సభ దానికి నిదర్శనమవుతుందని తెలిపారు.బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కూడా స్పందిస్తూ, భక్తిని డబ్బుతో కొలవడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. రామనామం విలువ కాంగ్రెస్ నాయకులకు తెలియదని మండిపడ్డారు. ఇక వీహెచ్పీ నేత పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
