మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆశ ఇప్పుడు నిజమైందని ఆయన పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ముఖ్యంగా విశాఖ మరియు రాయగడ డివిజన్ల మధ్య సమన్వయం పెరిగి సేవలు మెరుగుపడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారుతుందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి దోహదం అవుతుందని అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ నిర్ణయాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.
