మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, పథకాలు రావడంలేదని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీకి లేదని అన్నారు.బీజేపీ నేతలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, “జై శ్రీరామ్ అంటే పై నుంచి పైసలు పడుతున్నాయా? లేక రాష్ట్రానికి ఏమైనా పథకాలు వస్తున్నాయా?” అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు రావడంలేదని, అయినా బీజేపీ నాయకులు హిందీ నినాదాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర మంత్రులు, స్థానిక నాయకులు కూడా రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా మాట్లాడటం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
