మే 06, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.కొనుగోలు కేంద్రాల్లో వడ్ల సేకరణ లేక అన్నదాతలు అరిగోస పడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆయన మండిపడ్డారు. వడ్ల కొనుగోలుకు అవసరమైన నిధులు కేంద్రం అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా అమలు చేయడం లేదని విమర్శించారు. సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లలో కనీసం 16 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. తడిసిన వడ్లను కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై చూపుతున్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. యాసంగి వడ్ల కొనుగోళ్లను తక్షణమే పూర్తి చేయాలని, రైతుల కష్టాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కేంద్ర మంత్రి సూచించారు.
