Breaking News

భార్య లావుగా ఉందని హత్య చేసిన భర్త అరెస్ట్.. ప్రొద్దుటూరులో సంచలనం

మే 06, (నేటి తెలుగు పత్రిక): కడప జిల్లా ప్రొద్దుటూరులో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం ఆమె లావుగా ఉందనే కారణంతో భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన బద్రిపల్లి కిరణ్‌కు, ముద్దనూరుకు చెందిన పద్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రారంభంలో సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితం, బిడ్డ పుట్టిన తర్వాత పద్మ బరువు పెరగడంతో విభేదాలకు దారితీసింది. భార్య శరీరాకృతిని అవమానంగా భావించిన కిరణ్, ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో, ఎవరికి అనుమానం రాకుండా ఎలా హత్య చేయాలనే దానిపై ఇంటర్నెట్‌లో వెతికిన కిరణ్, ఆన్‌లైన్‌లో ఒక విష ద్రావణాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం పుట్టింటిలో ఉన్న భార్యను ప్రొద్దుటూరుకు తీసుకువచ్చి, ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. పద్మ స్పృహ కోల్పోయిన తర్వాత దిండుతో ముఖం అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేపట్టగా, నిందితుడు కిరణ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇంతటి ప్రమాదకరమైన విష పదార్థాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటన సమాజంలో కలకలం రేపడంతో పాటు, మహిళల భద్రత, ఆన్‌లైన్ నియంత్రణలపై చర్చకు దారితీస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *