మే 06, (నేటి తెలుగు పత్రిక): మెదక్ జిల్లాలోని లైఫ్ కేర్ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులకు తెలియకుండా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల ప్రకారం, డెలివరీ అనంతరం శిశువుకు టెస్టులు చేయాల్సి ఉందని చెప్పి నర్సులు ఉన్నిసా, నిలోఫర్ బిడ్డను తీసుకెళ్లినట్లు తెలిసింది. కొద్దిసేపటి తర్వాత శిశువు బ్లీడింగ్ కారణంగా మృతి చెందినట్లు తల్లిదండ్రులకు తప్పుదారి చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే అనుమానం వచ్చిన శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో ఆడ శిశువును సిద్ధిపేటకు చెందిన మహ్మద్ ఇక్బాల్కు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఇద్దరు నర్సులతో పాటు కొనుగోలుదారులుగా ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తెలంగాణ పోలీసులు కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని సీజ్ చేశారు. రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ సహా అన్ని ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అక్రమాలు జరిగి ఉండొచ్చనే అనుమానాలపై విచారణ కొనసాగుతోంది.
