తిరుపతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసీ తయారీ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో సుమారు 80 శాతం శ్రీసిటీ నుంచే సరఫరా చేయనుందని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సేవలను ఒక వాట్సాప్ సందేశంతోనే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.శ్రీసిటీలో ఇప్పటికే 70 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 35 వేల మంది మహిళలు ఉండడం విశేషమని, ఇది మహిళా శక్తికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలను కోరారు. క్యారియర్ గ్లోబల్ సంస్థ ఈ ప్రాజెక్ట్లో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభించనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద 40 ఎకరాల స్థలాన్ని ఈ యూనిట్ కోసం కేటాయించారు.ఈ యూనిట్లో గృహ వినియోగానికి ఒకటి, రెండు టన్నుల సామర్థ్యం గల ఏసీలతో పాటు, భారీ పరిశ్రమలకు అవసరమైన 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యం గల కూలింగ్ సిస్టమ్స్ను కూడా తయారు చేయనున్నారు.ఇక త్వరలోనే ఏఐ ఆధారిత నైపుణ్యాల ద్వారా ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్కు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
