విశాఖపట్నం, మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, 2019 నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ప్రత్యేక రైల్వేజోన్ సాధించలేకపోయిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ లక్ష్యం నెరవేరిందని అన్నారు.దక్షిణ కోస్తా రైల్వేజోన్కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనందకరమని పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు కావడం ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాల స్వప్నం నెరవేరినట్టేనని అన్నారు. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానుండడం చారిత్రాత్మక ఘట్టమని వివరించారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ రైల్వేజోన్ సాధ్యమైందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు.
