ప్రకాశం, మే 06, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వేసిన పునాదులతో టీడీపీ 44 ఏళ్లుగా బలంగా నిలబడిందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. టీడీపీ ఆవిర్భావంతో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని చెప్పి ప్రజలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని మంత్రి డీబీవీ స్వామి పేర్కొన్నారు.
