సిద్దిపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి తదుపరి లక్ష్యం తెలంగాణేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు కుటుంబపాలనకు ముగింపు పలికాయని ఈటెల పేర్కొన్నారు. బెంగాల్, తమిళనాడులో కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ప్రజలే చరిత్ర సృష్టికర్తలని, వారు అనుకుంటే పెద్ద నాయకులను కూడా ఓడించగలరని వ్యాఖ్యానించారు.తెలంగాణలో రెండేళ్లకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిలిచిపోయిందని విమర్శించారు.కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఖాయం అని, త్వరలో సంబరాల సమయం రానుందని ధీమా వ్యక్తం చేశారు.ఇక ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
