మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రైతుబంధు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం కొంత మొత్తమే అమలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు అమలు కాలేదని, రైతులు మోసపోయారని ఆయన అన్నారు. రైతుబంధు, పంట బీమా వంటి కీలక పథకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై స్పందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్కు తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ హెచ్చరించారు.
