మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్పల్లి జోన్ పరిధిలో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలపై జలమండలి విజిలెన్స్ విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. బాలాజీ నగర్, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1 సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించారు.తనిఖీల్లో మొత్తం 18 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నీటి సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా అక్రమ వినియోగం చేయడం వల్ల చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇలాంటి చర్యలు పునరావృతమైతే రూ.5,000 జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి హెచ్చరించింది. ప్రజలు అక్రమంగా మోటార్లు బిగించకుండా, సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించింది.
