మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత పాఠశాల ఫీజుల పెంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులు 50% నుంచి 120% వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించడం దురదృష్టకరమని, విద్యా రంగంపై సరైన దృష్టి లేదని అన్నారు. మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కవిత ప్రధాన వ్యాఖ్యలు:
- రాష్ట్రంలో 65–75% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని ఆందోళన
- కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో నడుస్తున్నాయని విమర్శ
- ఫీజుల పెంపుతో తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని వ్యాఖ్య
- ఫీజు రీయింబర్స్మెంట్లో సుమారు ₹11,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపణ
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఫీజులు ఏకంగా 120% పెంచడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఉన్న సంస్థలో ఇంత భారీ పెంపు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.అలాగే, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వ బాధ్యతలేనని స్పష్టం చేసిన కవిత, ఈ రెండు అంశాలపై తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తమిళనాడు లేదా గుజరాత్ మోడళ్లను అధ్యయనం చేసి ఫీజుల నియంత్రణకు శాశ్వత వ్యవస్థ తీసుకురావాలని సూచించారు.చివరిగా, ఫీజుల దోపిడీపై అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
