మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఓ ఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ టర్లాడ రాజశేఖర్ రావు ఎదుట విచారణ జరుగుతున్న సమయంలో ఓ యువ న్యాయవాది ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. లుక్ అవుట్ నోటీసు మరియు పాస్పోర్టు స్వాధీనం అంశాలకు సంబంధించిన కేసు విచారణలో ఈ ఘటన చోటుచేసుకుంది.విచారణ సందర్భంగా గతంలో ఇలాంటి కేసులో ఇచ్చిన ఆదేశాల ప్రతులు అవసరమని భావించిన న్యాయమూర్తి, కేసును వాయిదా వేయాలని సూచించారు. అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది వెంటనే విచారణ కొనసాగించాలని పట్టుబట్టారు. తన వాదనను పూర్తిగా వినలేదని పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు సహనం కోల్పోయింది.ఈ సందర్భంగా జడ్జి తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ “పోలీసులను పిలవండి” అంటూ ఆదేశించడం కోర్టు హాల్లో ఉద్రిక్తతను పెంచింది. న్యాయవాది వెంటనే క్షమాపణలు కోరినా, ఆయన ప్రవర్తనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర న్యాయవాదుల పేర్లు నమోదు చేసి సాక్షులుగా నమోదు చేయాలని కూడా సూచించింది.ఘటన తీవ్రత పెరగడంతో ఆ న్యాయవాదిని కస్టడీలోకి తీసుకోవాలన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. దీంతో అక్కడున్న న్యాయవాదులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత చర్చకు దారితీసింది.తర్వాత హైకోర్టు బార్ అసోసియేషన్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించింది. కస్టడీకి పంపాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం ఘటనకు కారణం కోర్టు వాయిదాపై న్యాయవాది పదేపదే అభ్యంతరం వ్యక్తం చేయడమేనని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
