మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికి తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఒలింపిక్స్లో రాణించే లక్ష్యంతో కొత్త క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రపంచస్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్ శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను పెంచుతాయని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
