మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ అనుచిత పదజాలం ఉపయోగించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి కేటీఆర్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వక అవమానం, ప్రజల్లో అశాంతి సృష్టించే ప్రకటనలకు సంబంధించిన సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో వరంగల్, హనుమకొండ రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
