మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో ‘కూల్ క్యాపిటల్’గా ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీసిటీలో క్యారియర్ సంస్థ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాదికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీలలో సుమారు 60 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటాయని, 2028 నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రంలో డేటా సెంటర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనికి అవసరమైన పరికరాల తయారీలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని చెప్పారు. డేటా సెంటర్లకు కూలింగ్ సిస్టమ్స్, చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ రంగంలో స్థానిక తయారీ పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రత్యేక పోర్టల్ను తీసుకువస్తున్నామని చెప్పారు. శ్రీసిటీ ఇప్పటికే గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగిందని, ఇది మేకిన్ ఇండియాకు గొప్ప ఉదాహరణ అని అన్నారు.క్యారియర్ సంస్థ రాష్ట్రాన్ని ఎంచుకోవడం ప్రభుత్వ విధానాలపై నమ్మకానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు.
