మే 07, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు నిర్వహించకపోవడం, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఆందోళన కారణంగా జాతీయ రహదారి 563పై వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని సద్దుమణిగించారు.
