మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హనుమకొండలో జరిగిన రైతుమేళాలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ హయాంలో రైతుబంధు నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఆ బకాయిలను సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు.రుణమాఫీ, యూరియా అంశాలపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ తుమ్మల.. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. యుద్ధ పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులకు యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.రసాయనాల వినియోగాన్ని తగ్గించి రైతులు ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు, పంట మార్పిడి పద్ధతులను ప్రోత్సహించాలని రైతులకు పిలుపునిచ్చారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను వేదికపైనే ఆదేశించారు.కాకతీయుల గడ్డపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించిన మంత్రి.. రైతుల అంశంలో ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
