మే 07, (నేటి తెలుగు పత్రిక): జై శ్రీరామ్ నినాదంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ భావోద్వేగాలను దెబ్బతీసేలా మాట్లాడటం తగదని విమర్శించారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. “జై శ్రీరామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా?” అని మంత్రి చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను అవమానించేవిగా ఉన్నాయని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మంపై గౌరవంతో వ్యవహరించాలని సూచించారు.సీఎం రేవంత్రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు జై శ్రీరామ్ నినాదాలు చేశారని గుర్తు చేసిన రాజాసింగ్.. ఇప్పుడు తన మంత్రులకు అదే భావన తెలియజేయలేదా అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదం కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.రాష్ట్రంలో దేవాలయాల భూముల కబ్జాలు పెరుగుతున్నాయని ఆరోపించిన రాజాసింగ్.. ముఖ్యంగా ఓల్డ్సిటీలో దేవాదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై సీఎం వెంటనే స్పందించాలని, అవసరమైతే కొండా సురేఖతో రాజీనామా చేయించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
